తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. కొందరు సకాలంలో కోలుకోగా మరికొందరు మృత్యువాత పడుతున్నారు. తాజాగా కరోనా బారినపడిన జగిత్యాల అదనపు ఎస్పీ దక్షిణామూర్తి మృతి చెందారు. వారం రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
దక్షిణామూర్తి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోనూ పనిచేశారు. వరంగల్లో పలు హోదాల్లో పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసు నిందితుల ఎన్కౌంటర్లో కీలకంగా వ్యవహరించారు. కరోనా బారినపడిన పోలీసుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నాలు చేశారు. కరోనా నుంచి కోలుకుని తిరిగి విధుల్లోకి చేరిన పోలీసులకు ఘన స్వాగతం పలికారు.