రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లి రూ.25 కే ప్రజలకు అందిస్తుంటే ఏవో ఘోరాలు జరిగిపోతున్నట్టు టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన పొరుగు రాష్ట్రాల్లోని ఏ ప్రభుత్వం సబ్సడీ ధరలపై ఉల్లి పాయలను సరఫరా చేయట్లేదని అన్నారు. సీఎం జగన్ ప్రత్యేక దృష్టితో కిలో ఉల్లిరూ.25కే అందిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ సభ్యులు ఉల్లిపాయదండలు ధరించి అసెంబ్లీలో వచ్చేందుకు యత్నించారని విమర్శించారు. ఒకవైపు రైతును, మరోవైపు వినియోగదారుడిని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే టీడీపీ నేతలు విమర్శలు చేయడంసరికాదని హితవు పలికారు.
ఉల్లిపాయలను అధిక ధరలకు విక్రయిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్న చంద్రబాబు ‘హెరిటేజ్’లో కిలో ఉల్లిపాయల ధర రూ.135, కు విక్రయిస్తున్నారని విమర్శించారు. ‘నీ సొంత వ్యాపార సంస్థల్లో ఇంత అధిక ధరలకు అమ్మాల్సిన పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయి?’ అని ప్రశ్నించారు. కేవలం, ఉల్లిపాయ ధరలే కాదు ఇతర నిత్యావసరవస్తువుల ధరలు కూడా ’హెరిటేజ్’ లో ఎక్కువగా ఉంటాయని విమర్శించారు. ‘ఈనాడు’లో ప్రచురించిన ఒక ఆర్టికల్ ఆధారంగా బయట దుకాణాల్లోని నిత్యావసరాల ధరలతో పోల్చి చూస్తే ‘హెరిటేజ్’ లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని అన్నారు.