ఆర్టీసీ విభజనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చెల్లుబాటుకాదని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన ఆర్టీసీ జేఏసీ, ప్రతిపక్ష నేతలతో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూట్లను వేరుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పారు. కార్మికులు ఆందోళనకు గురికావద్దని చెప్పారు.
తమ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తామని అన్నారు. సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. సమ్మెపై త్వరలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి ఈ నెల 4 లేదా 5న ఆయనను కలవనున్నట్లు అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.