కశ్మీర్ లో ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. అవంతిపుర సెక్టార్లో జరిగిన ఎన్ కౌంటర్ లో కశ్మీర్ అల్ ఖైదా చీఫ్ హమీద్ లెల్హారీ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. అల్ ఖైదా తన అనుబంధ సంస్థ అన్సర్ ఘజ్ వత్ ఉల్ హింద్(ఏజీహెచ్) పేర కశ్మీర్ లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మంగళవారం జరిగిన ఈ ఘటనపై జమ్ము,కశ్మీర్ డీజీపీ దిల్బగ్ సింగ్ మీడియాకు వివరాలను వెల్లడించారు.
హమీద్ లెల్హారీ, అతని ఇద్దరి సహచరులను భద్రతా బలగాలు చంపివేశాయని తెలిపారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున మందు గుండు సామాగ్రిని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయని ఆయన చెప్పారు. కాగా, ఏజీహెచ్ చీఫ్ గా ఉన్న జకీర్ మూసాను మే 23న దక్షిణ కశ్మీర్ లోని త్రాల్ గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్ లో సైన్యం చంపివేసిన రెండువారాల అనంతరం ఆ సంస్థ చీఫ్ గా హమీద్ లెల్హారీని నియమించారు.