రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్.ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ…ఈ 20 ఏండ్ల కాలంలో టీఆర్ఎస్ చరిత్రలో ఎన్నో విజయాలు సాధించాం.. చిన్న చిన్న విజయాలకే ఎగిరెగిరి పడుతున్న బీజేపీ నేతలకు తగిన సమయంలో బుద్ధి చెప్తాం. సహనాన్ని అసమర్థతగా భావిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ ఏర్పడ్డాయంటే అది కేసీఆర్ భిక్ష అని తెలిపారు. సీఎం కేసీఆర్ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నాటి ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఆ విషయాన్ని బీజేపీ నాయకులు మరిచిపోవద్దు.. మాటలు మాట్లాడే పరిస్థితి వస్తే.. తాము మీ కంటే ఎక్కువగా మాట్లాడుతామని హెచ్చరించారు. ఈ 20 ఏండ్లలో అనేక ఘటనలు చూశాం. అన్ని పరిస్థితులను నిలదొక్కుకొని ఈ స్థాయికి వచ్చామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్నిసాధించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టారు అని పేర్కొన్నారు.
కేసీఆర్ పరిపాలనాదక్షుడు అని కేంద్రమంత్రులే చెప్పారు. వందశాతం సాగు, తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం చెప్పిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ 9 గంటల కరెంట్ అని చెప్పి.. ఏ ఒక్క రోజు కూడా 6 గంటల కరెంట్ కూడా ఇవ్వలేదన్నారు. అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి రైతుల ప్రాణాలతో చెలగాటమాడారు అని ధ్వజమెత్తారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ర్టం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీలతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని తేల్చిచెప్పారు. ప్రతి గ్రామంలో అందర్నీ కలుపుకుపోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ అందరి పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో అగ్రభాగాన ఉండాలని స్థానిక కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఐదేళ్లలో జరగని అభివృద్ధి ఐదు నెలల్లో జగన్ చేశారు: మంత్రి అవంతి