అమలా పాల్ హీరోయిన్గా రత్నకుమార్ తెరకెక్కించిన సినిమా “ఆడై”. తెలుగులో ఆమెగా అనువాదమైంది ఈ చిత్రం. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కమర్షియల్గా అనుకున్న రీతిలో విజయం సాధించకపోయినా కూడా ఆమె నటనకు మాత్రం అద్భుతమైన మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో చాలా వరకు అమలాపాల్ నగ్నంగానే కనిపిస్తుంది. దాన్ని చాలా కళాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు రత్నకుమార్. ఎక్కడా అసభ్యకరంగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీపావళి సందర్భంగా కలర్స్ తమిళ్ టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇక ఈ చిత్ర హిందీ రీమేక్ పనులు మొదలయ్యాయని దర్శకుడు రత్నకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఓ స్టార్ హీరోయిన్ ఇందులో నటించబోతుందని.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తుందని ‘ఆమె’ దర్శకుడు రత్నకుమార్ ఫేస్బుక్లో పోస్ట్ చేసాడు. విక్రమ్ భట్ ‘ఆడై’ హిందీ రీమేక్ రైట్స్ తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో కంగన రనౌత్ హీరోయిన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈమెకు దర్శకుడు కథ చెప్పాడని, కొన్ని మార్పులకు కంగన సూచించినట్లు తెలుస్తుంది. కథ నచ్చితే ఎలా నటించడానికైనా సిద్ధంగానే ఉంటుంది కంగన. పైగా నటనకు స్కోప్ ఉన్న పాత్ర కాబట్టి ఆమె సినిమాపై ఈమె కూడా ఆసక్తికరంగానే ఉందని తెలుస్తుంది.