టీవీఎస్ మోటార్ కంపెనీ బీఎస్-6 ప్రమాణాలు కలిగిన కొత్త జూపిటర్ క్లాసిక్ ఈటీ-ఎఫ్ఐ మోడల్ని మార్కెట్లోకి విడుదలచేసింది. ఈ స్కూటర్ ఎక్స్షోరూం ధరను రూ. 67,911గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి రానున్న బీఎస్-6 ప్రమాణాలను అందుకోవడంలో భాగంగా టీవీఎస్ ఈ స్కూటీని విడుదల చేసింది. బీఎస్-6 కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈటీ-ఎఫ్ఐ టెక్నాలజీ మంచి పనితీరు, అధిక మైలేజీ ఇస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దీని వల్ల స్కూటర్ 15 శాతం అధిక మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
వాహన ముందు భాగంలో మొబైల్ ఫోన్ పెట్టుకునే చిన్నపాటి అర, యుఎస్బీ ఛార్జర్, టిన్టెడ్ విండ్స్ర్కీన్ వంటి ఫీచర్లను జోడించారు. జూపిటర్ క్లాసిక్లో 110 సీసీ బీఎస్-6 ఇంజిన్ అమర్చారు. ఇది 7500 ఆర్పీఎం వద్ద 7.9బీహెచ్పీ శక్తిని, 5500 ఆర్పీఎం వద్ద 8ఎన్ఎం టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ”ఈటీ-ఎఫ్ఐ టెక్నాలజీని భారత వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేశాం. జూపిటర్ క్లాసిక్ ఈటీ-ఎఫ్ఐ అధిక మైలేజీతో పాటు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది” అని టీవీఎస్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ తెలిపారు.