ఆర్టీసీ జేఏసీ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, తమ్మినేని, చాడ, రావుల, మందకృష్ణ మాదిక హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన అశ్వత్థామరెడ్డి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. పోలీసులతో అణచాలని చూస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని ఆయన ఒకింత హెచ్చరించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
రేపు అన్ని డిపోల ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగుతామన్నారు. 22న ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టవద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు విన్నవిస్తామని తెలిపారు. అదే విధంగా 23న అన్ని పార్టీల నేతలను కలుస్తామన్నారు. 24న మహిళా కండక్టర్లతో నిరసన ప్రదర్శన చేపడుతామని అశ్వత్థామరెడ్డి మీడియాకు వెల్లడించారు.