కిడ్నీ వ్యాధి బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ, రీసెర్చ్ ఆసుపత్రికి సీఎం జగన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి బాధితులకు స్టేజ్ 3 నుంచే పెన్షన్ అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం స్టేజ్ 5లో డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్న రూ. 10 వేల పెన్షన్తో పాటు, స్టేజ్ 3లో ఉన్న వారికి కూడా రూ. 5 వేల పెన్షన్ అందజేస్తామని పేర్కొన్నారు.
అదే విధంగా డయాలసిస్ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్ వర్కర్లను నియమిస్తామని, బాధితులతో పాటు వారికి కూడా ఉచిత బస్సు పాసులు అందజేస్తామని హామీ ఇచ్చారు. కిడ్నీ బాధితుల కోసం నిర్మిస్తున్న ఆస్పత్రిలో ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. సమస్యకు మూల కారణాన్ని అన్వేషించి వ్యాధులు రాకుండా ఉండేందుకు తగు చర్యలు చేపడుతామని అన్నారు.