telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రేటర్ పోలింగ్ కేంద్రాల జాబితా…

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా వార్డుల వారీగా తుది పోలింగ్ కేంద్రాల జాబితాను శనివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ విడుదల చేశారు.  గ్రేటర్‌లో మొత్తం 9,101 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇక కొండాపూర్ డివిజన్‌లో అత్యధికంగా 99 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు.  అత్యల్పంగా రామచంద్రాపురం డివిజన్‌లో 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో 1,500 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో సుమారు ప్రతి వెయ్యి మందికి ఒకటి కేటాయించారు. దీంతో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 9,101కి పెరిగింది. ఇక వికలాంగులకు, 80 ఏండ్లు పైబడిన వారికి, కోవిడ్ 19 పోసిటివ్ పేషెంట్లకు ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించబడింది. పై కాటగిరీల వారు ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా లేదా నేరుగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి వినియోగించుకోవచ్చు. పోలింగ్ కేంద్రంలో వికలాంగులు మరియు వయస్సు పైబడిన వారి సౌకర్యార్థం ర్యాంపులు ఏర్పాటు చేసి, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వీల్ చైర్లు తోయడానికి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వికలాంగులు, వయస్సు పైబడిన వారు, పసిపిల్లల తల్లులు క్యూలైన్ తో సంబంధం లేకుండా నేరుగా ఓటు వేయవచ్చు. కోవిడ్ 19 పేషెంట్లు మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ ధరించి, కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల లోపు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని తెలిపారు అధికారులు.

Related posts