పాక్ లో రెండు చోట్ల జరిగిన పేలుళ్లలో ఒకరు మరణించగా, మరో పదిమంది గాయపడ్డారు. పాక్ దేశం బలోచిస్థాన్ ప్రాంతం పరిధిలోని క్వెట్టా నగరంలోని ఖేజాయ్ చౌక్ వద్ద రెండు చోట్ల పేలుళ్లు జరిగాయి. మొదటి పేలుడు ట్రాన్స్పోర్టు కంపెనీ ఆఫీసు వద్ద జరిగింది. ఈ పేలుడులో గాయపడిన వారికి సహాయచర్యలు చేపట్టేందుకు రెస్క్యూ సిబ్బంది,పోలీసులు, జర్నలిస్టులు సంఘటన స్థలం సమీపంలోకి వచ్చారు. అంతో మరోసారి పేలుడు సంభవించింది.
ఈ జంట పేలుళ్లలో ఒకరు మరణించగా, మరో పదిమంది గాయపడ్డారని బలోచిస్థాన్ అధికార ప్రతినిధి లిఖత్ షహవానీ చెప్పారు. క్షతగాత్రుల్లో ఆరుగురు పోలీసులు, ఓ టీవీ జర్నలిస్టు, కెమెరామెన్ లు ఉన్నారని లిఖత్ పేర్కొన్నారు. పేలుళ్లలో గాయపడిన వారిని క్వెట్టా నగరంలోని పలు ఆసుపత్రులకు తరలించారు. జంట పేలుళ్లపై పాక్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.