అధికార పార్టీ ఎంఎల్ఏ కి పండగనాడే ఘోర అవమానం.. దళిత మహిళా ఎంఎల్ఏ అవడమే ఆమె తప్పు.. గణేషుడి మండపానికి వచ్చి విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చిన రాజధాని ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గం ఎంఎల్ఏకి తీరన అవమానం జరిగింది. దాంతో అందరి ముందు ఎంఎల్ఏ కంటతడి పెట్టుకున్నారు. తన నియోజకరవర్గంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి దర్శించుకుంటున్నారు. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలను సందర్శించటం ప్రతీ ఎంఎల్ఏకి మామూలే. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు చేస్తారు కాబట్టి మండపాలను సందర్శించమని అడగటం, వీళ్ళు వెళ్ళటం ప్రతీ సంవత్సరం జరుగుతున్నదే. ఇందులో భాగంగానే తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను చూసుకుంటే తుళ్ళూరు మండలంలోని అమరవరం అనే గ్రామానికి ఎంఎల్ఏ చేరుకున్నారు.
పార్టీ నేతలతో మాట్లాడుతూ మండపంలోకి ప్రవేశించే సమయానికి కొందరు అడ్డుకున్నారు. ఎందుకయ్యా అంటే ఎస్సీ ఎంఎల్ఏ మండపంలోకి ప్రవేశిస్తే గణేషుడు మైలపడిపోతారంటూ వాదన మొదలుపెట్టారు. సరే ఎలాగూ ఎంఎల్ఏ మద్దతుదారులు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ వాదన మొదలైంది. మొత్తానికి ఆ వాదన చాలా పెద్దదైంది. ఎంఎల్ఏ గ్రూపు ఎంత చెప్పినా ప్రత్యర్ధులు వినిపించుకోలేదు. దాంతో అందరి ముందు తనకు తీరని అవమానం జరగటంతో చేసేది లేక ఎంఎల్ఏ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత జరిగిన విషయంపై ఆరా తీస్తే ఎంఎల్ఏని అడ్డుకున్నది టిడిపి నేతలని తేలింది. కావాలనే ఎస్సీ పేరు చెప్పి అందరిముందు ఎంఎల్ఏని అవమానించటమే వాళ్ళ ఉద్దేశ్యంగా అర్ధమైపోయింది. విషయం తెలిసిన తర్వాత ఎంఎల్ఏ వాళ్ళపై కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. మొత్తం మీద టిడిపి చీప్ పాలిటిక్స్ ముందు ఓ అధికారపార్టీ ఎంఎల్ఏ కన్నీరు పెట్టుకోవాల్సొచ్చింది.