సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇటీవల రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో లేని సమయంలో రాజధానిపై మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మంత్రి చేసిన అసంబద్ధ వ్యాఖ్యలు ప్రజల్లో అనేక అనుమానాలకు దారితీశాయని రామకృష్ణ విమర్శించారు. వరదల వలన అమరావతి ఎక్కడా మునగలేదని.. భవిష్యత్లో అమరావతి అభివృద్ధి చెందేందుకు బ్రహ్మాండమైన అవకాశాలున్నాయన్నారు.
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రజల్లో రేకెత్తిన అనుమానాల దృష్ట్యా సీఎం జగన్ రాష్ట్రానికి రాగానే రాజధాని తరలింపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రామకృష్ణ కోరారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.


ప్రజలు ఇచ్చే తీర్పుతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలి: వంగవీటి రాధా