ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
మే 2వ తేదీన ప్రధాని అమరావతిలో పర్యటించి, సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారని మంత్రుల కమిటీ వెల్లడించింది.
ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ లతో కూడిన కమిటీ విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఆర్డీఏ అధికారులు, వివిధ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన నిర్వహణ కమిటీ సభ్యులు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మే 2న ప్రధాని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఏర్పాట్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కమిటీ అధికారులను ఆదేశించింది.
ప్రధాని పర్యటన సందర్భంగా అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని మంత్రుల కమిటీ అంచనా వేస్తోంది.
అందుకు అనుగుణంగా సభా ప్రాంగణం, హెలిప్యాడ్ల నిర్మాణం, సభకు చేరుకునే రహదారుల అభివృద్ధి, పార్కింగ్ సౌకర్యాలు, వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీరు, మజ్జిగ వంటి సౌకర్యాలను కల్పించడంపై మంత్రులు అధికారులతో చర్చించారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలేమీ లేవు.. అక్బరుద్దీన్కు పోలీసుల క్లీన్ చిట్!