గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మయన్మార్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీనితో జనజీవనం అస్తవ్యవస్థమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద ప్రభావానికి ఇండ్లు కొట్టుకొనిపోయాయి. దీంతో, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో 69 మంది మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరించారు.
చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టంకావడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మయన్మార్ ఆర్మీ, రెడ్ క్రాస్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపడుతున్నాయి. పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. విద్యా, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం ప్రజలను ఆదేశించింది.