జమ్మూకశ్మీర్ పై భారతప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరువాత అక్కడ ప్రజల మనోగతాలు స్వయంగా తెలుసుకునేందుకు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కశ్మీర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పర్యటన ముగియటంతో ఢిల్లీకి చేరుకున్నారు. జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత.. కశ్మీర్లోని పరిస్థితులను సమీక్షించేందుకు ఆగస్టు 6వ తేదీన దోవల్ అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 10 రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన దోవల్.. అక్కడ వివిధ వర్గాల వారితో చర్చలు జరిపారు.
ఉగ్ర ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భద్రత బలగాలకు సూచనలు చేశారు. అక్కడి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కశ్మీర్ పర్యటనలో భాగంగా దోవల్ షోపియన్ జిల్లాలో స్థానికులతో కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బక్రీద్ పండుగ నేపథ్యంలో అనంత్నాగ్లోని ఓ మేకల మండీలో గొర్రెల వ్యాపారులతో దోవల్ మాట కలిపారు. వ్యాపారం ఎలా జరుగుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితులపై ఏరియల్ సర్వే కూడా చేపట్టారు.