కర్ణాటక రాజకీయాలు ఆఖరి అంకానికి వచ్చాయి అనుకున్న ప్రతిసారి ఒక కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. తాజాగా, రేపు బలపరీక్ష ఉందనగా, దానిని ఆపేందుకు ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి అనారోగ్యం అంటూ ఆసుపత్రిలో చేరారు. సీఎం అనారోగ్యంపాలయ్యారని, ఆయన బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని జేడీఎస్ వర్గాలు తెలిపాయి. అయితే, కుమారస్వామి అనారోగ్యం అంతా ఓ పెద్ద డ్రామా అని బీజేపీ మండిపడింది. విశ్వాసపరీక్ష నేపథ్యంలో కుమారస్వామి కొత్త ఎత్తుగడ వేశారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంకీర్ణ ప్రభుత్వానికి విశ్వాసపరీక్ష నిర్వహించేందుకు మరికొన్ని గంటలే మిగిలున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై రెబెల్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై అసంతృప్త ఎమ్మెల్యేలు సమాలోచనలు జరుపుతున్నారు. రేపు బలనిరూపణ సందర్భంగా అసెంబ్లీకి గైర్హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సంకీర్ణ సీఎం కూడా మార్పు చేస్తున్నట్టు సమాచారం. కుమారస్వామిని తప్పించి డీకే ను రంగంలోకి దించనున్నట్టు తెలుస్తుంది. అసలకైతే సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గాల్సి ఉంది.