టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండురోజుల కుప్పం పర్యటనలో భాగంగా నేడు, రేపు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని శాంతిపురంలో టీడీపీ కార్యకర్తలు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయడం ఘర్షణకు దారితీసింది. ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వివరాలు తెలిపేలా డిజిటల్ బ్యానర్లు, ఫ్లెక్సీలను పలమనేరు జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేశారు. వీటిని చూసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని బ్యానర్ల ఏర్పాటును అడ్డుకున్నారు. జగన్ బ్యానర్లకు ముందు వాటిని ఏర్పాటు చేయడంపై ఘర్షణకు దిగారు.
ఇరు వర్గాల నాయకుల మధ్య వాగ్వివాదం జరిగి అది క్రమంగా తోపులాట వరకు వెళ్లింది. దీంతో జాతీయ రహదారిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు, రామకుప్పం, గుడుపల్లె ఎస్సైలలు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరు పార్టీల నేతలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే, వైసీపీ బ్యానర్లకు అడ్డంగా టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించే వరకు కదిలేది లేదని వైసీపీ నేతలు మరోమారు వాగ్వివాదానికి దిగారు. అయితే, చంద్రబాబు పర్యటన ముగిసిన వెంటనే తామే దగ్గరుండి తొలగిస్తామని, అప్పటి వరకు తొలగించే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు పట్టబట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాత్రంతా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.