తెలంగాణలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. తమ డిమాండ్ల సాధనతో పాటు స్త్రీనిధి బ్యాంకు సీఎండీ తీరును నిరసిస్తూ త్వరలో చలో హైదరాబాద్కు పిలుపునివ్వాలని భావిస్తున్నారు. స్త్రీనిధి క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ బ్యాంకులో నియామకాలను ఆపేయాలని, స్త్రీనిధిని సెర్ప్లో విలీనం చేయాలని కోరుతూ సెర్ప్ ఉద్యోగులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
ఈ విషయమై ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు వినతి పత్రం సమర్పించారు. జూన్ 11 నుంచి దశల వారీగా వారు ఆందోళనలు చేపడుతున్నారు. అప్పటికీ స్త్రీనిధి సీఎండీ వైఖరిలో మార్పు రాలేదని, దీంతో తమ ఆందోళలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేత గంగారెడ్డి తెలిపారు.