ఒమన్లో నివాసముండే ప్రవాస భారతీయుడు దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిల్లియనీర్ డ్రాలో జాక్పాట్ కొట్టాడు. ఏకంగా మిలియన్ డాలర్ల (రూ. 6,94,55,000) లాటరీ గెలుచుకున్నాడు. రఘు క్రిష్ణమూర్తి అనే వ్యక్తికి ఈ భారీ లాటరీ తగిలింది. 301 సిరీస్లో 2115 నెంబర్ గల టికెట్ కొన్న రఘుకు మిలియన్ డాలర్ల లాటరీ తగలడం విశేషం. ఇలా దుబాయి లాటరీలో మిలియన్ డాలర్లు గెలుచుకున్న 143వ భారతీయుడిగా రఘు నిలిచాడు. దుబాయి నివాసితుడైన మరో ఇండియన్, మాజీ దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిల్లియనీర్ విన్నర్ రతీష్ కుమార్ రవీంద్రన్నాయర్ చేతులమీదుగా ఈసారి డ్రా తీయగా రఘు లాటరీ గెలుచుకున్నాడు. ఇంతకుముందు రతీష్ కుమార్ 300 సిరీస్లో 1608 నెంబర్ గల టికెట్తో మిలియనీర్గా అవతరించినట్లు లాటరీ నిర్వహకులు తెలిపారు. మరో ఇద్దరు భారతీయులు కూడా ఈసారి డ్రాలో విజేతలుగా నిలిచారు. వారికి బిఎండబ్ల్యూ మోటార్ బైక్స్ దక్కాయి. 367 సిరీస్లో 0641 టికెట్ నెంబర్ గల శ్రీనివాస్ కరిరాం బిఎండబ్ల్యూ ఆర్ నైన్టీ రేసర్ బైక్ గెలుచుకోగా, 368 సిరీస్లో 0891 టికెట్ నెంబర్ గల మహరూఫ్ బాబు బిఎండబ్ల్యూ ఆర్ నైన్టీ/జీఏస్ బైక్ గెలుచుకున్నాడు.