ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా చంద్రబాబును జగన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
వైసీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగన్ ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలు సీఎంగా పని చేసిన అనుభవమున్న తమ ఆశీస్సులు కావాలని జగన్ కోరినట్టు తెలుస్తోంది. తన ప్రమాణస్వీకారానికి రావాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీతో పాటు పలువురు ముఖ్య నేతలను జగన్ ఆహ్వానించారు.