ఈ నెల 19న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని దాదాపుగా భాజపా ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్న నేపథ్యంలో ప్రధాన హిందీ రాష్ట్రాల్లో ఆ పార్టీ పొందే స్థానాలపై ఆసక్తి నెలకొంది. కీలక రాష్ట్రాలైన ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్, ఛత్తీస్గఢ్…ఈ అయిదు చోట్ల వచ్చే సీట్లపైనే ఆ పార్టీకి లభించే మెజార్టీ ఆధారపడి ఉంది. అందులోనూ ఉత్తర్ప్రదేశ్ మరింత కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ఈ అయిదు రాష్ట్రాల్లోని మొత్తం 185 సీట్లలోనూ 165 స్థానాలను దక్కించుకొంది. 90 శాతం విజయం నమోదయింది.
ప్రస్తుతం బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ప్రతిపక్షంకన్నా చాలా ముందుంటుందని ఎగ్జిట్పోల్స్ చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చింది. ఉత్తర్ప్రదేశ్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఆధిక్యం ఉంటుందని అంచనా వేశాయి. ఇక్కడ మొత్తం 80 స్థానాల్లోనూ భాజపాకు 33 నుంచి 65 వరకు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఎస్పీ-బీఎస్పీలు అనుసరించిన కుల సమీకరణల కారణంగా భాజపా ఎన్ని సీట్లు సంపాదిస్తుందనే దానిపైనే చర్చలు నడుస్తున్నాయి. ఈ అయిదు రాష్ట్రాల్లో భాజపాకు 89 సీట్లు వస్తాయని కొందరు లెక్కలు కడుతుండగా, మరికొందరు మాత్రం 144వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో మొత్తం 65 స్థానాలు ఉండగా, గత ఎన్నికల్లో 62 సీట్లు భాజపాకు వచ్చాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉందా అన్నదానిపై చర్చలు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు చోట్లా కాంగ్రెస్ గెలిచినా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతో ప్రజలు తిరిగి భాజపాకే ఓటు వేశారని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అందుకే 2014నాటి ఫలితాలు మళ్లీ వస్తాయని నమ్ముతున్నారు.
ఒకవేళ హిందీ రాష్ట్రాల్లో కొంచెం తగ్గినా, వాటిని పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో భర్తీ చేసుకుంటామని, సొంతంగానే మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని దాదాపుగా అన్ని సర్వేలూ చెప్పిన నేపథ్యంలో భాజపా విజయంపై వారు గట్టి విశ్వాసంతో ఉన్నారు.
అక్రమ నిర్మాణంలోనే చంద్రబాబు నివాసం: రామకృష్ణారెడ్డి