నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని రంగారెడ్డి నుంచి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని వరంగల్ నుంచి బరిలోకి దింపాలని నిన్ననే నిర్ణయించారు. అయితే, నల్గొండ విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇక్కడి నుంచి గుత్తా సుఖేందర్రెడ్డిని పోటీలో నిలపాలని భావిస్తున్నా ఆయన శాసనసభ్యుల కోటా కోసం పట్టుబడుతున్నారు.
దీనితో తేరా చిన్నపరెడ్డి, నంద్యాల దయాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, చకిలం అనిల్కుమార్, సుంకరి మల్లేశ్గౌడ్, వై.వెంకటేశ్వర్లులలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై నిన్న కేసీఆర్ తన నివాసంలో కేటీఆర్, ఎర్రబెల్లి, జగదీశ్రెడ్డి, మల్లారెడ్డి తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగా వరంగల్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. నల్గొండ విషయంలో నేడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అభ్యర్థులను ప్రకటించి బి-ఫారాలు ఇవ్వనున్నారు.