క్షణికావేశంలో ఒక్కోసారి ఎంతో నష్టం జరిగిపోతుంది. అది నోరు జారితే, విలువైన వారు దూరం కావచ్చు.. అదే చంపటమో, చావటమో లాంటి వాటికి పాల్పడితే .. ఆ లోటును పూడ్చలేము. అయితే ఇది దంపతుల మధ్య జరిగితే, వారి పిల్లలు అకారణంగా అనాధలుగా మిగిలిపోతారు. ఇంత చిన్న విషయం ఆవేశంలో గుర్తుకురాకపోవచ్చు. కానీ అది తెచ్చిపెట్టే నష్టం రెండు కుటుంబాలను, పసిపిల్లలను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా ఇలాంటి సందర్భమే ఒకటి అగ్రరాజ్యంలో చోటుచేసుకుంది.
టెక్సాస్లో దారుణం ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది. భార్యతో గొడవపడి ఆవేశంలో ఆమెను కాల్చి చంపాడు భర్త, అనంతరం తాను కూడా పాయింట్ బ్లాంక్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను శ్రీనివాస్ నెకరకంటి, శాంతిగా గుర్తించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరు తెలుగువారు, కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.