చైనాలో సాహసం పేరిట 18 అంతస్థులపైకెక్కిన 19 ఏళ్ల విద్యార్థి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయాడు. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఉన్న ఓల్డ్ క్వియాంగ్ లో సాహసం చేసేందుకు సిద్ధమయ్యాడు యాంగ్. అక్కడే ఉన్న 18 అంతస్థుల భవనమెక్కాడు. అతను అంచు చివరన నిల్చోవడం.. క్షణాల్లో కిందకు పడిపోవడం చకచకా జరిగిపోయాయి. ఒక్కసారిగా 18 అంతస్థుల నుంచి పడిపోవడంతో ఆ యువకుడు స్పాట్ లో ప్రాణాలు కోల్పోయాడు.
ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలను ముంబయి పోలీసులు .. సాహసం మాటున ప్రమాదాలు పొంచి ఉంటాయని చెబుతూ.. తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వాస్తవానికి ఈ ప్రమాదం ఏప్రిల్ 22న జరిగినట్లు తెలుస్తోంది. బిల్డింగ్ అంచు చివరన నిలబడి ఫోన్ కాల్ చేస్తూ స్టంట్ చేయబోయాడని సమాచారం. అయితే సడెన్ గా కొద్ది భాగం పెచ్చులూడి పడటంతో ఈ ప్రమాదం జరిగింది.