ఫణి తుఫాను శుక్రవారం ఉదయం ఒడిషాలోని పూరీ సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 22 కిలోమీటర్ల వేగంతో కోల్కతా మీదుగా బంగ్లాదేశ్ వైపుగా ఫణి పయనిస్తోంది. బంగ్లాదేశ్ కన్నా ఫణి తుఫాను కోల్కతాను తాకే అవకాశం ఉండటంతో బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది.ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించింది. దీంతో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అప్రమత్తమయ్యారు. ఖరగ్పూర్లో ఆమె ఇవాళ తుఫాన్ పరిస్థితిని అంచనా వేయనున్నారు. శనివారం కూడా ఆమె తీరం సమీపంలోనే ఉండి పరిస్థితులను పరిశీలించనున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు నిర్వహించాల్సిన ఎన్నికల ర్యాలీలను మమత రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. రైళ్లు రద్దు కావడంతో కోల్కతా రైల్వే స్టేషన్లో వందల సంఖ్యలో జనం అక్కడే ఉండిపోయారు. కోల్కతా విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు ఉదయం 8.30 నిమిషాల వరకు అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.