విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ లో నడి రోడ్డు పై ప్రెస్ మీట్ పెడతానన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. ఓ పోలీస్ వాహనాన్ని ఎస్కార్ట్ గా ఇచ్చి బలవంతంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు తిప్పిపంపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని రామ్గోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో యామిని మాట్లాడుతూ.. ఆర్జీవీని సైకో డైరెక్టర్ అని వ్యాఖ్యానించారు. అలాంటి సైకోకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. కాగా.. ఆర్జీవీ మద్దతు పలుకుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేసిన విషయం విదితమే. అయితే యామిని వ్యాఖ్యలపై ఆర్జీవీ ఎలా రియాక్టవుతారో వేచి చూడాలి.
మరో వైపు ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని రేపు విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండానే సినిమా విడుదలకు వారు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో, సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది.