భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ “పిఎం నరేంద్రమోదీ”. ఎన్నికల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ భారతీయ జనతా పార్టీకి లబ్ది చేకూరేలా, ప్రజలను ప్రభావితం చేసేలా ఉందని, సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు వేసిన పిటీషన్ పై న్యాయస్థానం మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. తాజాగా పీఎం నరేంద్ర మోదీ సినిమాను పూర్తిగా చూసిన తర్వాతే దానిపై నిర్ణయం తీసుకోవాలని ఇవాళ సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. పీఎం నరేంద్ర మోదీ సినిమాను పూర్తిగా చూసి, శుక్రవారం లోగా దానిపై సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇవ్వాలని ఈసీని కోర్టు ఆదేశించింది. పీఎం నరేంద్ర మోదీ సినిమాను ప్రజల వీక్షణ కోసం విడుదల చేయాలా వద్ద అన్న అంశాన్ని కూడా అందులో చేర్చాలంటూ కోర్టు పేర్కొన్నది. చిత్ర నిర్మాతల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని ఈసీని కోర్టు కోరింది. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 22వ తేదీన ఉంటుంది. సినిమాను చూడకుండానే ఈసీ దానిపై స్టే విధించారని చిత్ర నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఈసీ ఇచ్చిన స్టే.. ప్రాథమిక భావ స్వేచ్ఛను ఉల్లంఘించినట్లే అని నిర్మాతలు కోర్టుకు తెలిపారు.
previous post