telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు వార్తలు

నేడు ఢిల్లీలో జరుగుతున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026″లో పాల్గొనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026″లో ఆయన పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు పలు కీలక ఒప్పందాలు, ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు.

ఉదయం జరిగిన “ఏఐ యాక్సిలరేటర్స్: ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనమిక్ గ్రోత్” ప్లీనరీ సెషన్‌లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాదతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు.

అనంతరం, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీఈవో బోర్కే బ్రెండేతో కలిసి “కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం” అనే అంశంపై జరిగే రౌండ్‌టేబుల్ సమావేశంలోనూ పాల్గొంటారు.

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది.

ఐబీఎం, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్, ఐఐటీ మద్రాస్, ఎన్విడియా వంటి సంస్థలతో ఏఐ మౌలిక సదుపాయాలు, క్వాంటం నైపుణ్యాభివృద్ధికి సంబంధించి మొత్తం 7 ఒప్పందాలు కుదరనున్నాయి.

యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రతినిధి బృందంతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. అదేవిధంగా, అరాంకో, అడోబ్, ఆటోడెస్క్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ఎండీ, సీఈవోలతో కూడా సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చిస్తారు.

Related posts