telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మజ్లీస్ పార్టీకి వేసినట్టే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఎర్రగడ్డ డివిజన్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో మార్పు తెచ్చే ఎన్నిక అని చెప్పుకొచ్చారు.

పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్, పదేళ్లకుపైగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యలు చేశారు.

నియోజకవర్గంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగిపొర్లుతోందని ఎక్కడ చూసినా చెత్తాచెదారంగా మారిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలించేది కాంగ్రెస్ కాదని మజ్లిస్ పార్టీ అంటూ దుయ్యబట్టారు.

పాతబస్తీలో మజ్లీస్ గుండాల కారణంగా చాలా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయన్నారు.

నాడు కేసీఆర్ పాలనలో మజ్లీస్ పార్టీ భుజాల మీద మోశారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందని తెలిపారు.

ఈ మూడు పార్టీలు ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు. వీరందరూ కలిసి బీజేపీ పార్టీని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలే అని వారి కోసమే పని చేస్తాయని విమర్శలు గుప్పించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పరోక్షంగా మజ్లీస్ పార్టీ ఏలాలని చూస్తోందన్నారు. జూబ్లీహిల్స్‌ను మజ్లీస్ పార్టీకి అప్పజెప్పొద్దన్నారు సెంట్రల్ మినిస్టర్.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మజ్లీస్ పార్టీకి వేసినట్టే అని అన్నారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో భవిష్యత్ లేదని.. ఆ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్టే అంటూ కామెంట్స్ చేశారు.

బీజేపీ కార్యకర్తలు నవంబర్ 11 వరకు నిబద్ధతతో పని చేయాలని ప్రజల మధ్యలో పని చేయాలని సూచించారు. బీజేపీ అభ్యర్థి దీపక్ ప్రజల మధ్యలో ఉన్న నాయకుడన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా పని చేశారన్నారు.

బీజేపీ అభ్యర్థి అయిన దీపక్ కోసం పని చేయాలని కార్యకర్తలం అందరం కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

మజ్లీస్ పార్టీ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్‌ను రక్షించుకోవాలన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జూబ్లీహిల్స్‌లో న్యాయం గెలవాలని  ప్రజలే గెలవాలని తెలిపారు.

దేశానికి ప్రధాన మంత్రి మోదీ ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకొచ్చారని పేదల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Related posts