telugu navyamedia
National వార్తలు

రాజ్యసభ ఎంపీగా తమిళంలో ప్రమాణం చేసిన కమల్ హాసన్‌

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వరుసగా ఐదోరోజు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి.

సభ ప్రారంభం కాగానే ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళంలో ఆయన ప్రమాణం చేశారు.

కాగా, జూన్‌లో డీఎంకే కూటమి మద్దతుతో క‌మ‌ల్‌ రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విష‌యం తెలిసిందే. ఆయనతో పాటు డీఎంకే నుంచి పి. విల్సన్, సల్మా, ఎస్.ఆర్. శివలింగం కూడా ఎంపీగా ఎన్నిక‌య్యారు. వారు కూడా తాజాగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇక‌, 2018లో ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించిన కమల్ హాసన్… 2021 తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ప్రకటిస్తూ.. డీఎంకేకు తమ పార్టీ మద్దతును ప్రకటించారు.

ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. డీఎంకే పార్టీ తమిళనాడులో తమ పార్టీ జెండా ఎగురవేసింది.

ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో నాలుగు రాజ్యసభ స్థానాలనూ ఆ పార్టీనే దక్కించుకుంది.

పొత్తులో భాగంగా 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Related posts