శుక్రవారం దోహా వేదికగా మొదలైన ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.
నీరజ్ తన కెరీర్లోనే తొలిసారి 90.23 మీటర్ల మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో గతంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (89.94 మీటర్లు)ను భారత గోల్డెన్ బాయ్ అధిగమించాడు.
అయితే, దోహా డైమండ్ లీగ్ లో మాత్రం రెండో స్థానానికే పరిమితమయ్యాడు.
జర్మనీకి చెందిన అథ్లెట్ జులియన్ వెబర్ బల్లెంను ఏకంగా 91.06 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు.
కాగా, కెరీర్ బెస్ట్ త్రో చేసిన నీరజ్ చోప్రాపై ప్రశంసలు కురుస్తున్నాయి.
తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా అభినందించారు. అద్భుతమైన మైలురాయిని సాధించావు, దేశం ఉప్పొంగి, గర్వంగా ఉంది అంటూ నీరజ్ ను ప్రధాని మెచ్చుకున్నారు.