తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు( కేసీఆర్) అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ జరిగింది. పార్టీ ప్రతినిధులు పలు తీర్మానాలపై చర్చించి, ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామ రావు( కేటీఆర్) పలు తీర్మాణాలను ప్రవేశపెట్టారు. దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ ఆయన ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. భారతదేశాన్ని 75 ఏండ్ల పరిపక్వ ప్రజాస్వామ్య దేశంగా ఘనంగా చెప్పుకుంటున్నామని.. అయితే, నేటికీ దేశ ప్రజలు తాగు, సాగునీరు, విద్యుత్ అందక అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు.
- దేశంలో రైతురాజ్యం స్థాపించాలి.
- ప్రతీ రాష్ట్రంలో ఒక భారీ నీటి ప్రాజెక్టు నిర్మించాలి
- 24 గంటల పాటు దేశ వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా
- మన దేశ బ్రాండ్తో విదేశాలకు ఫుడ్ ప్రాడెక్టులను ఎగుమతి చేయాలి
- దళితబంధు దేశ వ్యాప్తంగా అమలు చేయాలి
- దేశంలో భారీ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలి
- దేశంలో బీసీ జనగణన జరపాలని తీర్మానం
- ద్వేషాన్ని విడిచి,ప్రశాంతతకు దేశ పౌరులంతా ఏకం కావాలి
- దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ పనిచేయాలి
తెలంగాణ మినహా.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జనం తాగు, సాగునీరు లేక బాధలు అనుభవిస్తున్నారని తీర్మాణంలో పేర్కొన్నారు. దేశంలో అనేక పట్టణాలు, నగరాల్లో వారం రోజులకోసారి తాగునీరు రావడం లేదని.. పల్లెల్లో మహిళలు మైళ్ల దూరం నడిచి తాగునీరు తెచ్చుకుంటున్నారని అన్నారు. కడివెడు నీళ్ల కోసం వీధిపోరాటాలకు దిగాల్సి వస్తుందని మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు.