పార్లమెంటు వర్షకాల సమావేశాలలో విపక్ష సభ్యుల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా రాజ్యసభలో మరో ముగ్గురు ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్కు గురైన ఎంపీలలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ పథక్, ఇండిపెండెంట్ ఎంపీ అజిత్ కుమార్ భుయాన్ ఉన్నారు.
నిరసనలతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు వారిని ఈ వారం సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చెప్పారు. ఈ వారం చివరివరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు.
దీంతో పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ఇప్పటివవరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 27కి చేరింది. వీరిలో రాజ్యసభకు చెందిన 23 మంది ఎంపీలు, లోక్సభకు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు.
మరోవైపు..మండిపోతున్న నిత్యావసరాల ధరలు, ఆహార పదార్థాలపై జీఎస్టి, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టి వర్షాకాల సమావేశాల నుండి సస్పెండయిన ప్రతిపక్ష ఎంపీలు పలువురు ఆందోళన కొనసాగిస్తున్నారు. గత రాత్రంతా ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఇలా పగలూ రాత్రి 50 గంటల పాటు నిరసన చేపట్టాలని నిర్ణయించారు.