హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ మహమ్మారి పెను కలకలం సృష్టించింది. బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ పబ్బుపై శనివారం అర్ధరాత్రి తర్వాత టాస్క్ ఫోర్స్ బలగాలు జరిపిన దాడుల్లో అక్కడ డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టయింది.
ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పబ్లో డ్రగ్స్(కొకైన్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
ఈ క్రమంలో బంజారాహిల్స్ పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెల్లుతున్నాయి. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్నా కూడా ఈ పబ్ లో ఏం జరుగుతుందనే విషయమై పోలీసులు పట్టించుకోకపోవడంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసే వరకు కూడా ఈ విషయమై బంజారాహిల్స్ పోలీసులు దృష్టి పెట్టకపోవడం పోలీస్ ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పించింది.
అలాగే గతంలో కూడా రాడిసన్ పబ్పై ఎన్నో ఫిర్యాదులు వచ్చినా బంజారాహిల్స్ పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
దీంతో బంజారాహిల్స్ సీఐ శివచంద్రను సీపీ సీవీ ఆనంద్ వెంటనే సస్పెండ్ చేశారు. మరోవైపు ఏసీపీ సుదర్శన్కు కూడా ఛార్జిమెమో జారీ చేశారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏసీపీని సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు