జోవాద్ తుపాను మరింత బలపడుతోంది. ఉత్తరాంధ్ర తీరానికి 120 కిలోమీటర్ల చేరువలో తుపాను కేంద్రీకృతమైంది. ఇక విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 120 కిలోమీటర్లు..గోపాల్పుర్కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో జోవాద్ తుపాను కేంద్రీకృతమైంది.
ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఒడిశాలపై ఈ జవాద్ తుఫాన్ ప్రభావం పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుపాను రేపు (ఆదివారం) మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తుపాను ప్రభావంతోవిశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ తీరానికి దగ్గరగా వచ్చే సమయంలో 100 కి.మీల వేగంతో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

ప్రజలందరికీ హెచ్చరిక
తుఫాన్ దాటికి వీస్తున్న గాలులకు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం మెళియాపుట్టి మండలం గోపినాధపురం గ్రామంలో కొబ్బరి చెట్టు విరిగిపడి 17 ఏళ్ల బాలిక మృతి చెందింది. దీంతో ఒక్కసారి ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆ చిన్నారికి నివాళులు అర్పిస్తూ… ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం మరియు ఉద్దాన ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని…తుఫాన్ తీవ్రత తగ్గేవరకు ప్రజలెవరూ ఇళ్ళు విడిచి బయటకు రావద్దని విన్నవిస్తున్నాము అని అధికారులు వెల్లడించారు.

