ఓ మంచి సినిమా చూడాలంటే ఈ మధ్యకాలంలో టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకని పరిస్థితుల్లో నాకు దొరికిన ఒక ఆణిముత్యం ఈ జై భీమ్.. ముఖ్యంగా 90ల కాలం నాటి కథ..
అప్పట్లో గిరిజనులు పడే సమస్యల కోసం నడుం బిగించిన ఒక యువ న్యాయవాది కధ.. చదువురాని వారు, లోకజ్ఞానం అసలు తెలియని వాళ్ళు తప్పుడు కేసుల్లో ఇరుక్కుని అన్యాయంగా జైలు శిక్షలు ఎలా అనుభవిస్తున్నారో ప్రత్యక్షంగా మన కళ్ళకు కట్టిన చిత్రం.
పోలీసు, న్యాయ వ్యవస్థ ఇద్దరూ కలిసి చేసే చెడును, చేయవలసిన మంచిని సరిగ్గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు జ్ఞానవేల్. అసలు కొన్ని సన్నివేశాలు తీసిన విధానం ముఖ్యంగా తమిళులకే చెందుతుందేమో అనిపిస్తుంది. అంత సహజంగా ఉన్నాయి ఆ సన్నివేశాలు.. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఆ కాలంలో పల్లెటూళ్లలో జరిగినవి.. విన్నవి.. కన్నవి..అన్నీ కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి..కేవలం కథను మాత్రమే నమ్మి ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్న నటుడు సూర్య కు.. నిర్మించడానికి ముందుకు వచ్చిన జ్యోతికకు ప్రత్యేక అభినందనలు చెప్పుకోవాలి.
రొటీన్ తెలుగు సినిమాలు చూడటం అలవాటు అయిన వాళ్ళు మాత్రం ఈ చిత్రం దరిదాపులకు కూడా వెళ్ళవద్దు. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్ లిజోమోల్ జోస్ నిజంగా నటించడం కంటే కూడా జీవించింది అనే చెప్పాలి.. సినిమా పూర్తయ్యాక కూడా ఆమె పాత్ర మనకు గుర్తుండిపోతుంది.. మణికంఠన్ పాత్ర కూడా అంతే.. అసలీ నటుల్ని ఎక్కడినుంచి తెచ్చారో కానీ నిజమైన గిరిజనులు ఉన్నారంతా.. ఈ విషయంలో తమిళ టెక్నీషియన్స్ నుంచి మనం చాలా నేర్చుకోవాలి..
లాయర్ చంద్రు ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని పేపరు చదువుతుంటాడు. ఆ టైమ్ లో అక్కడే ఉన్న రాజన్న బిడ్డ చంద్రులాగే కాలుమీద కాలేసుకుని కూర్చోని న్యూస్ పేపర్ చదవడం ఈ సినీమాకు హైలెట్. ఆ సీన్ చదువు ప్రాధాన్యతను గుర్తు చేసింది.
‘జై భీమ్’ సినిమా ఓవరాల్ గా చదువు, జ్ఞానం, విద్య ఆవశ్యకతే భవిష్యత్ కు మార్గం అంటూ హిత బోధ చేస్తోంది. అన్యాయాన్ని గెలిపించే చాలా మంది లాయర్లు ఉన్నారు. కానీ.. అందుకు భిన్నంగా నిస్వార్థంగా, నిజాయితీగా పని చేసే చెన్నై జస్టిస్ చంద్రు పాత్ర అందరికీ మార్గదర్శకం. డైరెక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా ఇలా వేటికవే సూపరసలు.. కుదిరితే ఓ లుక్కేయండి ప్రైమ్ వీడియోలో ఉంది..
“కార్తీక దీపం” సీరియల్ పై దర్శకుడి వెదవ కామెంట్స్… !?