ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రఘురామ దాఖలుచేసిన ఈ పిటిషన్పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది.
ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపించారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపిన అంశానికి ముగింపు కార్డు పడింది. సీబీఐ కోర్టు తీర్పుతో వైసీపీ శిబిరంలో సంతోషకర వాతావరణం నెలకొంది.
ఆంధ్ర ప్రదేశ్ అంటే అడవాళ్ల ప్రదేశ్ గా మారాలి: రోజా