‘మా’ ఎన్నికలు అంతకంతకు వివాదానికి దారి తీస్తున్నాయి. గతంలో ‘మా’ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎక్కువ ధరకు అసోసియేషన్ బిల్డింగ్ కొని అతి తక్కువ ధరకు అమ్మేశారంటూ ఇటీవల మోహన్బాబు చేసిన వ్యాఖ్యలపై నటుడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ అమ్మకం వ్యవహరం అంతా నరేశ్-శివాజీరాజాలకే తెలుసని ఆయన అన్నారు. భవనం అమ్మకం గురించి నరేశ్నే ప్రశ్నించాలన్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చిస్తూ ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు నేతృత్వంలో గత నెలలో జూమ్ మీటింగ్ జరిగింది. పలువురు ‘మా’ సభ్యులు అందులో పాల్గొన్నారు. మీటింగ్లో భాగంగా మోహన్బాబు మాట్లాడుతూ.. ‘‘అధిక మొత్తంతో ‘మా’ భవనాన్ని కొనుగోలు చేసి అతి తక్కువ ధరకే దానిని ఎందుకు అమ్మేశారు? సినిమా పెద్దలు అప్పుడు ఎందుకని పెదవి విప్పలేదు?’’ అని ప్రశ్నించారు.
దీనికి నాగబాబు కౌంటర్ ఇచ్చారు.. ‘‘బిల్డింగ్ కొనుగోలు చేసిన సమయంలో నేనే అధ్యక్షుడిగా ఉన్నాను. సినిమా పెద్దల సూచనలు.. అప్పుడు ఉన్న అవసరాలు దృష్టిలో ఉంచుకుని రూ.71.73 లక్షలతో భవనాన్ని కొనుగోలు చేశాం. ఇంటిరీయర్ డిజైన్ కోసం మరో రూ.3 లక్షలు వెచ్చించాం. 2006-08 వరకు నేను అధ్యక్షుడిగా ఉన్నాను. 2008లో అధ్యక్ష పీఠం నుంచి దిగిన తర్వాత ‘మా’ వ్యవహరాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదు. ‘మా’ అభివృద్ధికి కావాల్సిన సలహాలు మాత్రమే ఇచ్చాను. బిల్డింగ్ అమ్మకం వ్యవహరమంతా నరేశ్ - శివాజీ రాజాలకే తెలుసు. శివాజీరాజా అధ్యక్షుడిగా నరేశ్ కార్యదర్శిగా ఉన్నప్పుడే బిల్డింగ్ బేరం పెట్టి రూ.30 లక్షలకే దాన్ని అమ్మేశారు. కాబట్టి ‘అతితక్కువ ధరకు బిల్డింగ్ ఎందుకు అమ్మేశారు?’ అని నరేశ్ని అడగండి. నేను కూడా అదే విషయంపై నరేశ్ని ప్రశ్నిస్తాను. బిల్డింగ్ అమ్మకం వ్యవహరం గురించి మళ్లీ నాపై వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తాను’’ అని నాగబాబు తెలిపారు.