టోక్యో: పారాలింపిక్స్లో భారత్కు పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత మహిళా(టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్ ఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణిపై ఆమె తిరుగులేని విజయం సాధించింది. జాంగ్ మియావోను 3-2 తేడాతో ఓడించింది. దేశానికి కనీసం రజతం ఖాయం చేసింది. పోలియో జయించి పతకానికి ఓ అడుగు దూరంలో నిలిచిన భవీనాబెన్ ప్రయాణం పలువురికి ఆదర్శం.
సెమీస్లో భవీనాబెన్ ఆట అద్భుతమనే చెప్పాలి. గతంలో ఆమెపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన జాంగ్ను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 తేడాతో ఓడించింది. దాదాపుగా 34 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తన సత్తా ఏంటో చూపించింది. తొలి గేములో భవీనాకు ఎదురుదెబ్బ తగిలింది. అయిన ఆమె వెంటనే పుంజుకుంది. వరుసగా రెండు గేములు కైవసం చేసుకొని 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో గేమ్ను ఆమె కేవలం 4 నిమిషాల్లో గెలుచుకోవడం ప్రత్యేకం.
కీలకమైన నాలుగో గేమ్లో ప్రత్యర్థి జంగ్ తన సూపర్ క్లాస్ ఆటతీరును ప్రదర్శించింది. ఫలితంగా 2-2తో సమమైన మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో గేమ్కు దారితీసింది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన భవీనా చివరి గేమ్లో వరుసగా పాయింట్లు సాధిస్తూ 5-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. జాంగ్ సైతం వేగంగానే స్పందించి స్కోరును 5-9కి అట్నుంచి 8-9కి తగ్గించింది. ఈ క్రమంలో టైమ్ఔట్ తీసుకున్న భవీనా ఆట మొదలవ్వగానే వరుసగా రెండు పాయింట్లు సాధించి ఫైనల్కు చేరుకుంది. స్వర్ణ పతక పోరులో భవీనా ప్రపంచ నంబర్వన్ ఝౌతో తలపడనుంది.
‘నేనిక్కడికి వచ్చినప్పుడు మరేం ఆలోచించకుండా 100% శ్రమించాలని అనుకున్నా. ఎందుకంటే వందశాతం కష్టపడితే పతకం కచ్చితంగా వస్తుంది. నా దేశ ప్రజల ఆశీర్వాదాలు, ఇదే ఆత్మవిశ్వాసంతో కొనసాగితే ఆదివారం కచ్చితంగా స్వర్ణం గెలవగలను. నేను పసిడి పోరుకు సిద్ధంగా ఉన్నాను’ అని భవీనా సెమీస్ తర్వాత మీడియాకు చెప్పింది.