ఉగ్రదాడి పై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఎ.పాల్ స్పందించారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బలహీనత వల్లే దేశంలో ఉగ్రవాదం పెరుగుతుందన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు. మూడు నెలల తర్వాత వచ్చే ప్రభుత్వాలతో పాకిస్తాన్, ఇండియా మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తు వచ్చిందని, గ్లాసులా పగలదని, ఫ్యానులా తుప్పుపట్టదని, సైకిల్లా పాడుకాదని అన్నారు.
చంద్ర బాబు, వైఎస్ జగన్లకు చెరో 25 సీట్లు వస్తే అద్భుతమేనని పాల్ అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు రెండూ ఓడిపోయే పార్టీలేనని వ్యాఖ్యానించారు, మార్చి నెలలో ఏపీ రాజకీయాల్లో మార్పులు రానున్నాయని, ఏప్రిల్లో సునామీ వస్తుందని జోస్యం చెప్పారు. శనివారం సాయంత్రం ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తామని అన్నారు. పవన్, ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కడా డిపాజిట్లు కూడా రావని అన్నారు. పవన్ తమతో పొత్తు పెట్టుకుంటారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.