ఏపీ నీటి దోపిడీని అడ్డుకుంటామని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. దీనిపై ఇప్పటికే ఎన్జీటీకి ఫిర్యాదు చేశామని, కేంద్రంతోనూ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాటల్లో తప్పులేదని, వైఎస్ దొంగ అయితే.. జగన్ గజదొంగ అనే మాటలను తాను సమర్థిస్తున్నానని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారని, జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వయంగా ఇంటికి ఆహ్వానించారని గుర్తు చేశారు. భేషజాలకు పోకుండా తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేద్దామని కేసీఆర్ ప్రతిపాదించారని, గోదావరి జలాలను సమృద్ధిగా వినియోగించుకుందామని అన్నారని పువ్వాడ అన్నారు. వైఎస్ హయాంలో తెలంగాణలో అద్భుతమైన ప్రాజెక్టులు కట్టామని చెప్పుకుంటున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాకి ఒక్క ఎకరానికైనా నీరు వచ్చిందా? అని మంత్రి పువ్వాడ ప్రశ్నించారు. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టును నిర్మించి రెండు, మూడు పంటలకు నీటికి సమకూర్చుకుంటున్నామని అన్నారు.
previous post
మూడు ముక్కలాట ఎందుకు ఆడుతున్నారు: చంద్రబాబు ఫైర్