మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14న బిజేపి తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ మారినప్పటి నుంచి.. ఈటల పై టీఆర్ఎస్ నాయకులు మాటల దాడి చేస్తున్నారు. తాజాగా బీజేపీ నేత ఈటల రాజేందర్ పై ఘాటు లేఖ విడుదల చేసింది తెలంగాణ మావోయిస్టు పార్టీ. ఈటల రాజేందర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను తీవ్రంగా ఖండించింది తెలంగాణ మావోయిస్టు పార్టీ. ఈటల రాజేందర్ తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ.. కెసిఆర్ కు వ్యతిరేకంగా పొడతానని చెప్పాడని.. కాని దానికి విరుద్దంగా హిందుత్వ పార్టీ బిజెపి తీర్థం పుచ్చుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్,ఈటెల రాజేందర్ కు మధ్య జరుగుతున్న వివాదమని..దీనితో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
కేసీఆర్,ఈటెల రాజేందర్ ఇద్దరు ఒకే గూటి పక్షులు అని తెలంగాణ మావోయిస్టు పార్టీ ఫైర్ అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు కెసిఆర్, ఈటెల రాజేందర్ తూట్లు పొడిచారని మండిపడ్డారు. వీరి పాలన ప్రజా వ్యతిరేకమైందన్నారు. మొన్నటి వరకు కెసిఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటల తన ఆస్తుల పెంపుదలకు ప్రయత్నించాడని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించాడని ఆరోపించారు. కెసిఆర్ బర్రెలు తినేవాడు అయితే.. ఈటల రాజేందర్ గొర్రెలు తినే ఆచరణ కొనసాగించాడని జగన్ మండిపడ్డారు.

