కారులో షికారుకెళ్తే, అది వారాంతంలో.. వెళ్లడం వరకు బాగానే ఉంటుంది.. మార్గమధ్యంలో ఏ సమస్య లేకపోతె చాలా మంచిదే. కానీ ఇటీవల జరుగుతున్న నేరాలు.. ఇలాంటి సరదాలకు ఆశపడుతున్న వారికి పీడకలగా తయారవుతున్నాయి. దారిలో దుండగులు కారులో వెళ్లే వాళ్ళను కూడా బ్రతకనీయటంలేదు. ఎవరు లేని ప్రాంతంలో కారులో వెళ్తున్న వారినే లక్ష్యంగా చేసుకొని ఈ నేరాలు జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటనతో లాంగ్ డ్రైవ్ ఆశపడేవారికి హెచ్చరికగా మిగిలింది. కారులో వెళుతున్న యువతిని బయటకు లాగి పదిమంది యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన పంజాబ్లోని లుధియానాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. 21 ఏళ్ల యువతి తన స్నేహితుడితో కలిసి శనివారం రాత్రి లుధియానా నుంచి కారులో ఐజేవాల్ గ్రామానికి బయలుదేరింది.
ఈ జంటను గమనించిన పదిమంది యువకులు మూడు ద్విచక్ర వాహనాలపై వెంబడించారు. పెద్దగా అరుస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేశారు. కారు జాగ్రోన్ వద్దకు చేరుకోగానే కారుకు అడ్డంపడ్డారు. కారు ఆగగానే రాళ్లు, ఇటుకలతో దానిపై దాడిచేశారు. అనంతరం కారులోని యువతీ యువకులను బయటకు లాగి సిద్వాన్ కాలువ ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తమ స్నేహితులు మరో ఆరేడుగురిని ఫోన్ చేసి పిలిపించారు. అందరూ కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు పరారయ్యారు. ఘటన అనంతరం బాధితులు ఇద్దరూ అక్కడే ఉన్నారని ఎస్పీ తరుణ్ రత్తన్ తెలిపారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని నిందితులను గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇది ప్రమాదం, తస్మాత్ జాగర్త!!