వివాదాస్పద రాజకీయ పోస్టులు, వీడియోలు, కామెంట్లపై వాట్సాప్ సంస్థ ఇటీవల రాజకీయ నాయకులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాట్సాప్ సంస్థ ఏకంగా రాజకీయ నాయకుల అకౌంట్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్కు చెందిన వాట్సాప్ అకౌంట్ ను ఆ సంస్థ బ్లాక్ చేసింది. ఆయన తాము విధించిన నిబంధనలను ఉళ్లంఘించడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆయన వాట్సాప్ అకౌంట్ పై తమకు పలు ఫిర్యాదులు అందాయని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే తనపై ఇలాంటి కుట్రలు చేస్తోందని సీఎం రమేష్ ఆరోపించారు. తాన వాట్సాప్ అకౌంట్ పనిచేయకపోవడంపై ఇప్పటికే ఆ సంస్థకు లేఖ రాసినట్లు తెలిపారు. ఇదే వాట్సప్ అకౌంట్ ద్వారా ప్రజలు తనతో వారి సమస్యల గురించి ఫిర్యాదు చేస్తుంటారని తెలిపారు. హటాత్తుగా ఇలా అకౌంట్ బ్లాక్ చేయడం వల్ల ప్రజలతో తన సంబంధాలు తెగిపోయే అవకాశం వుందని సీఎం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.