వాహనాల పై ‘పోలీస్’, ప్రెస్’ పేరుతో స్టిక్కర్లను అతికించుకుని వెళ్తున్న వాహన చోదకులపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. కొందరు ద్విచక్రవాహనచోదకులు, కార్లలో వెళ్లేవారు సంబంధం లేకపోయినా పోలీస్, ప్రెస్ స్టిక్కర్లను వినియోగిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. నేరాల నుంచి తప్పించుకునేందుకు, తనిఖీల నుంచి మినహాయింపు కోసం కొందరు వీటిని దుర్వినియోగం చేస్తున్నారని భావిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పాత్రికేయులకు ప్రభుత్వం గుర్తించిన అక్రిడిటేషన్ కార్డులు చూపిస్తే వదిలేస్తున్నామని చెప్పారు.
మూడు రోజుల నుంచి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 380 మందిని హెచ్చరించారు. రెండోసారి స్టిక్కర్లతో చిక్కితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వాహనాల తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్లు నిర్వహిస్తున్నప్పుడు ద్విచక్రవాహన చోదకుల్లో కొందరు, కార్లలో వెళ్లేవారిలో మరికొందరు ‘పోలీస్’ ‘ప్రెస్’ స్టిక్కర్లను అతికించుకుని వెళ్తుండగా వారి వాహనాలు ఆపి గుర్తింపు పత్రాలను చూపించమని ప్రశ్నిస్తున్నారు. పదుల సంఖ్యలో వాహనచోదకుల వద్ద సరైన గుర్తింపు కార్డులు లేవని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.