దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతి జ్వాల శాశ్వతంగా నేటితో చరిత్రలో కలసిపోనుంది. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు వార్ మెమోరియల్ లో ఈ జ్యోతిని విలీనం చేశారు.
ఇండియాగేట్, వార్ మెమోరియల్ వద్ద రెండు జ్వాలల నిర్వహణ కష్టతరమవుతోందని ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాప్ చీఫ్ ఎయిర్ మార్షల్ బలభద్ర రాధాకృష్ణ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో అమర జవాను జ్యోతిని.. జాతీయ యుద్ధ స్మారకంలో కలిపారు.
1971లో ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు గుర్తుగా ఇండియా గేట్ వద్ద అమర జవాను జ్యోతిని ఏర్పాటు చేశారు.
అమర జవాన్ల కోసం జాతీయ యుద్ధ స్మారకం నిర్మించినందున ఇండియా గేట్ వద్ద ప్రత్యేక జ్యోతి ఎందుకన్న వాదన ఉన్నట్లు సైనికవర్గాలు పేర్కొన్నాయి. 1947-48 పాకిస్థాన్ యుద్ధం మొదలుకొని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికుల వరకు అందరి పేర్లు జాతీయ యుద్ధ స్మారకంలో ఉన్నాయని గుర్తుచేశాయి.
అయితే.. ఈ చర్యపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కొందరు దేశభక్తిని, త్యాగాన్ని అర్థం చేసుకోలేరంటూ రాహుల్ గాంధీతో సహా పలు పార్టీలకు చెందిన నేతలు సోషల్ మీడియా వేదికను తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
శౌర్యపరాక్రమాలు చాటిన జవాన్ల స్మారకార్థం వెలిగిన జ్యోతి ఈ రోజు లేకపోవడం విచారకరమని అన్నారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమర జవాను జ్యోతిని మళ్లీ వెలిగిస్తామని భరోసా ఇచ్చారు.
బీజేపీ సర్కార్ చర్య.. ప్రజాస్వామ్య సంప్రదాయాలపై ఏమాత్రం గౌరవం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తేలిందని అన్నారు. నవ భారతదేశం’ కోసం ప్రజలు ఎంతో ఇష్టపడే ఆలోచనలు, స్మారక చిహ్నాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ ప్రియాంక చతుర్వేది నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.