అధ్యక్ష ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. అఫ్గాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన బాంబు పేలుడులో కనీసం 26 మందికిపైగా పౌరులు చనిపోయారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. పేలుడు సమయంలో ప్రధాని అష్రఫ్ ఘనీ అక్కడే ఉండడం గమనార్హం. అయితే, ఆయన క్షేమంగానే ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పర్వాన్ ప్రావిన్స్ రాజధాని చరీకార్లో మంగళవారం ఈ పేలుడు సంభవించగా, కొద్ది వ్యవధిలో కాబుల్లో మరో పేలుడు చోటు చేసుకుంది. ఈ దుశ్చర్యలకు బాధ్యులమని ఇంతవరకూ ఏ ఉగ్ర సంస్థా ప్రకటించుకోలేదు. ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగే ప్రాంతానికి ప్రధాన ద్వారం వద్ద మొదటి పేలుడు సంభవించడంతో ప్రాణ నష్టం తగ్గిందని పర్వాన్ ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి తెలిపారు.
మంగళవారం ప్రధాని ఎన్నికల ప్రచార ర్యాలీలో బాంబు పేలుడు ఘటన జరిగింది. గ్రీన్ జోన్గా పిలిచే ప్రాంతానికి సమీపంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఇక్కడే రక్షణ మంత్రత్వశాఖ, అమెరికా రాయబార కార్యాలయం, నాటో ప్రధాన కార్యాలయం వంటివి ఉంటాయి. అఫ్గాన్ ప్రభుత్వం, అమెరికా దళాలకు వ్యతిరేకంగా తాలిబన్లు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేసినట్లుగా కనిపిస్తోంది. సెప్టెంబరు 28న జరగనున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని విపరీతంగా తగ్గించేందుకు తాలిబన్లు ఈ దశ్చర్యలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.