ఆసీస్, ఇంగ్లాండ్పై సిరీసులు గెలిచిన టీమ్ఇండియాపై దాదా ప్రశంసలు కురిపించారు. ‘జట్టు గొప్పగా ఆడింది. బయో బుడగల్లో ఉంటూ క్రికెట్ ఆడింది. అయిపోగానే గదుల్లోకి వెళ్లింది. ఐపీఎల్ నుంచి వారు సాధించిన ప్రతిదీ అద్భుతమే. మనం కచ్చితంగా అజింక్య రహానెను అభినందించాలి. మొదట అతడు ఆసీస్లో జట్టును విజయపథంలో నడిపించాడు. ఇంగ్లాండ్పై కోహ్లీ, కోచ్, సహాయ సిబ్బంది, ప్రతి ఒక్కరినీ ప్రశంసించాలి. కుర్రాళ్లను తీర్చిదిద్దడంలో తెరవెనుక ద్రవిడ్ శ్రమించాడు. బ్రిస్బేన్ ఫలితమే అందుకు ఉదాహరణ’ అని గంగూలీ తెలిపారు.
జాతీయ క్రికెట్ అకాడమీలో రాహుల్ ద్రవిడ్ శ్రమించడంతోనే టీమ్ఇండియా రిజర్వుబెంచ్ ఇంత పటిష్ఠంగా ఉందని దాదా స్పష్టం చేశారు. జస్ప్రీత్ బుమ్రా లేకుండా మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఆసీస్పై ఆఖరి టెస్టులో గెలిపించడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగుందని, వయసు పెరుగుతున్నప్పుడు కొన్ని సర్దుబాట్లు తప్పవని చెప్పారు. గుండెపోటుతో భయపడలేదని త్వరగా పరిష్కరించుకోవాలని చెప్పడంతో శస్త్రచికిత్స చేయించుకున్నానని తెలిపారు. రెండు, మూడో టీ20 వీక్షించేందుకు అహ్మదాబాద్ వెళ్తానని వెల్లడించారు.