ఒకసారి కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ రాదు అని అనుకుంటున్నారు అందరూ… కానీ రెండో సారి కరోనా బారిన పడిన ఓ యువ డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. కడప జిల్లాలో ఈ ఘటన జరిగింది. బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల పిల్లల డాక్టర్ నందకుమార్కు మూడు నెలల క్రితం కరోనా సోకింది. దీంతో గుంటూరులోని NRI ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. తర్వాత యథావిధిగా విధులకు హాజరయ్యారు. అయితే… 15 రోజుల క్రితం జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించుకోగా మరోసారి పాజిటివ్ అని తేలింది. దీంతో ఇంటి వద్దే ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినా తగ్గకపోవడంతో వైద్యుల సలహా మేరకు కడప రిమ్స్కు వెళ్లారు. అక్కడి నుంచి తిరుపతి స్విమ్స్కు తరలించారు. నందకుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ నందకుమార్ చనిపోయారు. చిన్న వయసులోనే వైద్య వృత్తిలోకి వచ్చి ఎంతో భవిష్యత్ ఉన్న నందకుమార్… కరోనా బారిన పడి చనిపోవడం పలువుర్ని కన్నీరు పెట్టిస్తోంది. అయితే కరోనా వచ్చిన తర్వాత దానినుండి బయటపడినవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
previous post
next post